మానుషి చిల్లర్.. పరిచయం అవసరం లేదు. 2017 లో ప్రపంచసుందరిగా కిరీటం గెలుచుకుంది మానుషి చిల్లర్. అప్పటి నుంచి ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎంతగానో తహతహలాడింది. కానీ ఇప్పటివరకూ అవకాశం దక్కించుకోవడంలో విఫలమైంది. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. కింగ్ ఖాన్ షారూక్.. సల్మాన్.. రణవీర్ లాంటి హీరోల సరసన నటించాలనుందని బహిరంగంగానే ప్రకటించిన మానుషికి అప్పట్లో యశ్ రాజ్ ఫిలింస్ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న భారీ హిస్టారికల్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
దురదృష్టమో ఏమో కానీ మానుషి కి ఆఫర్ దక్కినా ఈలోగానే మహమ్మారీ వల్ల మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకు కొంత గ్యాప్ తర్వాత షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. “ఐదేళ్ల క్రితం మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన అదే రోజున పృథ్వీరాజ్ కోసం నా మొదటి షాట్ చిత్రీకరించారు. అదంతా ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. నవంబర్ 18 ఖచ్చితంగా నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. నా జీవితంలో రెండు అతిపెద్ద మైలురాళ్ళు ఒకే రోజున సాధ్యమైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా తొలి చిత్రానికి మొదటి షాట్ లో నటించడం ఎగ్జయిట్ చేసింది“ అని మానుషి ఆనందంగా చెప్పుకున్నా కానీ ఆ ఆనందం నిలవలేదు.
తన లైఫ్ లో విలువైన ఐదేళ్ల కాలం కరిగిపోయింది. దురదృష్టం వెంటాడింది. ఇటీవల మానుషి ఇన్ స్టా మాధ్యమంలో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. ఏది ఏమైనా కానీ మానుషి ఆశించినది ఒకటి .. అయినది ఇంకొకటి.. తాను నటిస్తున్న పృథ్వీరాజ్ చిత్రం కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. రెండు వేవ్ లతో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయింది. ఐదేళ్లుగా తపిస్తున్నా తనకు ఆ అరుదైన క్షణం రానే లేదు. పృధ్వీరాజ్ లో నటిస్తున్న అక్షయ్ బ్యాక్ టు బ్యాక్ అరడజను ప్రాజెక్టులకు కమిటైతే.. తన తొలి చిత్రమే ఇంకా రిలీజ్ కి రాలేదు. ఎప్పటికొస్తుందో కూడా క్లారిటీ లేదు. అందుకే ఐదేళ్లు ఈ బ్యూటీకి కాలహరణం అయ్యింది. ఏదీ కలిసి రాలేదు.